Teacher: నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. అది మీరే మీరే మాస్టారు.. మా దేవుడు మీరే మాస్టారు.. అన్నారు ఓ సినీ కవి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువుకు ఉందంటారు. అలాంటి గురువులు అనేక మంది పిల్లల చదువు కోసం అహర్నిశలూ కృషి చేస్తుంటారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఎంతటి కష్టానికైనా వెనుకాడరు కొందరు ఉపాధ్యాయులు. ఈ క్రమంలో సొంతంగా కొందరు డబ్బు ఖర్చు చేస్తూ పిల్లల చదువుకు సాయం చేస్తుంటారు.
తమిళనాడులోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చేసిన పనికి ఇప్పుడు లోకమంతా అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల చదువు కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో వారి చదువుకోసం, ఇంగ్లిష్ పాఠాలు బోధించడం కోసం పరితపిస్తున్న ఆ ఉపాధ్యాయురాలు.. ఏకంగా తన సొంత నగలను సైతం అమ్మేసి సౌకర్యాలు కల్పించింది. ఈ పనికి తమిళనాడు రాష్ట్రంతోపాటు దేశం మొత్తం గర్విస్తోంది. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిందంటూ అందరూ మెచ్చుకుంటున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురానికి చెందిన టీచర్ అన్నపూర్ణ మోహన్.. కందాడులోని గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పని చేస్తున్నారు. మూడో తరగది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. తన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని తాపత్రయపడేవారు. కార్పొరేట్ చదువులు చెప్పించి అనర్గళంగా ఇంగ్లిష్లో మాట్లాడుతుంటే చూడాలని ఆమె కోరిక. అందుకు తగిన సౌకర్యాలు లేవు. దాని కోసం బృహత్తర కార్యక్రమానికి పూనుకుంది.
పేద పిల్లల కోసం ఇంకా చేయాలి..
టీచర్ సొంత నగలను అమ్మేసి కొన్ని సొమ్ములు పోగేశారు. తర్వాత పిల్లలు ఇంగ్లిష్లో మాట్లాడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. పలువురు ఆర్థికసాయం చేశారు. దాంతో పాటు సింగపూర్, కెనడా లాంటి దేశాల నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఆ నిధులతో స్కూల్లో డిజిటల్ పరికరాలు, ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలు, ఫర్నిచర్ లాంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోంది ఆ టీచర్. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ చదువులు చదవలేని పేద పిల్లల కోసం తాను ఇంకా శ్రమిస్తానని స్పష్టం చేస్తోంది టీచర్ అన్నపూర్ణమ్మ.