T20 World Cup 2022: ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్పై టీమిండియాతో పాటు ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. టీమిండియా ఎట్టకేలకు ఈ సారి సెమీ ఫైనల్కి చేరుకోవడంతో.. కప్ కొట్టేందుకు ఇంకా రెండు అడుగుల దూరంలో మాత్రమే భారత్ ఉంది. ఈ రోజు ఇంగ్లండ్తో జరిగే సెమీ ఫైనల్లో గెలిస్తే భారత్ ఫైనల్కి చేరుకోనుంది. ఫైనల్లో పాకిస్తాన్ను ఓడిస్తే కప్ భారత్ చేతుల్లోకి వస్తుంది. ఇంగ్లండ్ జట్టుతో పోలిస్తే పాకిస్తాన్ను ఓడించడం సులువు. దీంతో నేడు జరగనున్న రెండో సెమీ ఫైనల్లో బలమైన ఇంగ్లండ్ జట్టును ఓడిస్తే భారత్కు కప్ వచ్చినట్లేనని టీమిండియా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
గతంలో 2007లో టీమిండియా తొలిసారి మహేంద్రసింగ్ ధోనీ ఆధ్వర్యంలో టీ20 వరల్డ్ కప్ అందుకోగా.. అప్పటి ఓ సెంటిమెంట్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2007 టీ 20 వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ను గ్రూప్ దశలో ఓడించి, ఆ తర్వాత ఫైనల్ పోరులోనూ దాయాది జట్టును ఓడించి తొలిసారి కప్ సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో కూడా తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్ను టీమిండియా మట్టికరిపించింది. ఇవాళ ఇంగ్లండ్తో భారత్ గెలిస్తే ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్తో తలపపడనుంది.
దీంతో అప్పటి సెంటిమెంట్ను ఇప్పుడు ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. 2007 వరల్డ్ కప్లో జరిగినట్లే ఇప్పుడు జరగబోతుందని, ఈ సారి టీ20 వరల్డ్ కప్ రోహిత్ సేనదే అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచి 15 ఏళ్లు అవుతుంది. 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడబోతుందని, రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందంటూ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
పాకిస్తాన్కు కలిసొచ్చిన అదృష్టం..
పాకిస్తాన్ అసలు గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టాల్సి వచ్చేది. కానీ ఆ జట్టుకు ఈ సారి అదృష్టం కలిసొచ్చిందని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికాపై పసికూన నెదర్లాండ్ గెలవడం, సౌతాఫ్రికాపై భారత్ ఓడిపోవడంతో పాకిస్తాన్ కు అదృష్టం తొడై సెమీస్ వరకు చేరుకోగలిగింది. సెమీ ఫైనల్లో బలంగా ఉన్న న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కి చేరుకుంది. మరి నేటి మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్లో పాక్తో భారత్ తలపడుతుందా? లేదా? అనేది చూడాలి.