ED Attacks: ఇటీవల కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చెలరేగిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నాయనే అపవాదు వినిపిస్తున్నా లెక్క చేయడం లేదు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో ఇదంతా జరుగుతోందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అయినాసరే మోదీ కనీసం ఈ అంశంపై స్పందించడం లేదు.
ఇటీవల ఈడీ అధికారుల కన్ను తెలుగు రాష్ట్రాలపై పడింది. ముఖ్యంగా తెలంగాణలో అధికార పార్టీ నేతలు ఎవరు కనపడితే వారిపై అటాక్లు చేస్తూ పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంటోంది ఈడీ. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. మంత్రి మల్లారెడ్డి లాంటి నేతలైతే బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రధాని మోదీ ఉసిగొల్పుతున్నారని, వీటికి తాము భయపడేది లేదని కుండబద్ధలు కొడుతున్నారు.
మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, ఏకంగా తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే మోదీ చూశారని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో ఇటీవల చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో కూడా ఈడీ దూకుడు పెంచింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఈడీ దాడులు జరిగాయి. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ED Attacks: ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం..
తాజాగా ఈడీకి మరింత బలం చేకూర్చేందుకు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈడీకి మరో 15కు పైగా ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకొనే అనుమతి వచ్చినట్లవుతోంది. ఈ 15 ఏజెన్సీల్లో రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు కూడా ఉండటం గమనార్హం. అంటే రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తెస్తున్నట్లవుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలు నడుపుతున్న వ్యక్తులకు, సంస్థలకు గుబులు పట్టుకుంది. ఇప్పటికే చెలరేగిపోతున్న ఈడీ.. ఇప్పుడు మరింత ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉందని చర్చ నడుస్తోంది.