Vizag Murder: విశాఖపట్నంలో ఘోరం వెలుగు చూసింది. కన్నబిడ్డను ఓ కసాయి తండ్రి కడతేర్చాడు. తెలిసీ తెలీని వయసులో ప్రేమ వ్యవహారం నడిపిందనే సాకుతో అత్యంత కర్కశంగా వ్యవహరించిన ఈ తండ్రి.. మైనర్ బాలిక అయిన తన బిడ్డను చంపేస్తూ సెల్ఫీ వీడియో కూడా తీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అతని మానసిక స్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో యువతీ యువకులు ఆకర్షణకు లోనవుతుంటారు. టీనేజీలో ఇది అత్యంత సహజం. ఇలాంటి తరుణంలో వారికి నచ్చజెప్పాల్సిన బాధ్యత, అవగాహన కల్పించాల్సిన కర్తవ్యం తల్లిదండ్రులదే. కానీ కొందరు ప్రేమ అనే పదం వింటేనే రగిలిపోయే తల్లిదండ్రులుంటారు. పిల్లలకు అవగాహన కల్పించాల్సింది పోయి ఏకంగా కడతేర్చే మానసిక స్థితి కలిగి ఉంటారు. ఇలాంటి కోవలోకే విశాఖ ఘటన నిందితుడు వస్తాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం వద్ద రెల్లి వీధిలో వడ్డాది వరప్రసాద్ నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. 13 ఏళ్ల కిందటే భార్య వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు ఆడ పిల్లల్ని పెంచుతున్నాడు. పెద్దమ్మాయి ఇష్టమైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇక రెండో కుమార్తెను చదివిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
డ్రైవర్ గా పని చేస్తున్న వరప్రసాద్.. తన రెండో కుమార్తె కూడా ఎవరినో ప్రేమిస్తోందని ఇటీవల తెలుసుకున్నాడు. ప్రేమ లాంటి వ్యవహారాలు వద్దని చెప్పి చూశాడు. అయితే, చిన్న కుమార్తె లిఖిత తండ్రి మాటలు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన తండ్రి వరప్రసాద్.. లిఖితను గొంతు నులిమి తన చేతులతో కడతేర్చాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన పెను సంచలనం రేపుతోంది.