Allu Aravind: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై గత ఐదు దశాబ్దాలుగా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ఆయన నిర్మించారు. ఈ మధ్య కాలంలో ‘అల వైకుంఠపురంలో’, ‘డీజే టిల్లు’ లాంటి సూపర్ హిట్స్ను ఆయన ప్రేక్షకులకు అందించారు. ఆయన నిర్మాణంలో ఇటీవల తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ కూడా మంచి విజయాన్ని సాధించింది.
అల్లు అరవింద్ ఒకవైపు స్ట్రెయిట్ చిత్రాలను నిర్మిస్తూనే.. మరోవైపు డబ్బింగ్ చిత్రాల పైనా కన్నేశారు. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి.. భారీ ఎత్తున టాలీవుడ్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలై బంపర్ హిట్ కొట్టిన ‘కాంతార’ చిత్రమే దీనికి ఉదాహరణ. కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను తెలుగులోకి అరవింద్ విడుదల చేశారు. ఈ మూవీని పంపిణీ చేయడం ద్వారా ఆయన భారీ లాభాలను ఆర్జించారని తెలుస్తోంది.
రూ.3 కోట్లతో రూ.60 కోట్ల లాభం
తెలుగులో ‘కాంతార’ ఊహించని విధంగా రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. తెలుగు నాట రిలీజైన తొలి రోజే బ్రేక్ ఈవెన్ అయిన ‘కాంతార’.. మొత్తంగా రూ.60 కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ‘కాంతార’ను కేవలం రూ.3 కోట్లతో కొన్న అరవింద్.. అరవై కోట్లను జేబులో వేసుకున్నారని చెబుతున్నారు. దీంతో మరో పరభాషా చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
ఈసారి హిందీ సినిమాను తెలుగులోకి..
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, అందాల తార కృతీ సనన్ నటిస్తున్న ‘భేడియా’ సినిమాను తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ‘తోడేలు’ చిత్రాన్ని నవంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు. మరి, ఈ చిత్రంతో ఆయన ఏ స్థాయిలో లాభాలను మూటగట్టుకుంటారో చూడాలి.