Crime News: నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు. అలాగే భర్త మంచివాడు అయితే ఆ కుటుంబం కూడా బాగుంటుంది. కట్టుకున్న భర్త ఏం చేసినా కొందరు భార్యలు సర్దుకుపోతుంటారు. దీంతో వాళ్ల ఆటలు కొనసాగుతుంటాయి. కానీ దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ఎప్పటికైనా అలాంటి భర్తల ఆటలకు చెక్ పడక తప్పదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ కూడా తన భర్త ప్రవర్తనను తట్టుకుని జీవనం సాగించింది. కానీ చివరకు అతడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే చనిపోతూ ఆమె తన తండ్రికి ఫోన్ చేసి భర్త గురించి అన్ని విషయాలను బహిర్గతం చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఇటావాకు చెందిన రవీంద్ర మిశ్రా (57) కుమార్తె పూనమ్ తల్లిదండ్రులను ఎదురించి 2007 ఏప్రిల్ 29న నీరజ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే కొన్నాళ్లకే ఆమె కాపురం కకావికలంగా మారింది. పూనమ్ను నీరజ్ ప్రతిరోజూ మానసికంగా హింసించేవాడు. కట్నం తీసుకురాలేదని పనిమనిషి కంటే హీనంగా చూసేవాడు. తన జీవితాన్ని నాశనం చేశావంటూ పూనమ్ను చిత్రహింసలకు గురిచేసేవాడు.
చివరకు భార్యను, కొడుకును వదిలేసి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆమెతోనే చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాడు. భర్త ప్రవర్తనను తట్టుకోలేక అతడు పెట్టే చిత్రహింసలు భరించలేక సూసైడ్ చేసుకుందామని పూనమ్ భావించింది. జరిగిందంతా తన తండ్రికి ఫోన్ చేసి మొరపెట్టుకుంది. దీంతో తల్లిదండ్రులు పూనమ్ను ఓదార్చారు.
అల్లుడి ఆట కట్టించిన మామ:
పూనమ్ను ఓదార్చిన తల్లిదండ్రులు దీపావళి తర్వాత ఇంటికి రమ్మని కోరారు. కానీ ఆమె తన పుట్టింటికి వెళ్లేందుకు నిరాకరించింది. అయితే దీపావళి జరిగిన మూడ్రోజుల తర్వాత పూనమ్ తన ఇంట్లోనే యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పూనమ్ తండ్రి తన అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు చెప్పిందంతా పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.