Megastar Chiranjeevi:ఈ మధ్య ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ వాటి అమలులో లోపాలు ఉన్నాయనే విషయం ఇలాంటి సందర్భాల్లో స్పష్టం అవుతుంది. అయితే ప్రభుత్వాలు, కోర్టులు కఠినంగానే వ్యవహరిస్తున్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో నిందితులు సులభంగా తప్పించుకుంటున్నారు. ఇక పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తులు.. వారి పరపతిని ఉపయోగించి శిక్షల నుండి తప్పించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనల పట్ల ప్రముఖులు, పెద్దలు, సినీ తారలు స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇటీవల బంజారాహిల్స్లో జరిగిన ఘటన తనను కలచి వేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తేవాలని, వ్యవస్థలన్నీ అందుకు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అందుకు విచారణ నిస్పాక్షికంగా జరగడం, వేగంగా జరగడం అవసరం అని పేర్కొన్నారు.
బంజారాహిల్స్లోని DAV పబ్లిక్ స్కూల్లో LKG చదివే చిన్నారి (4) పై జరిగిన అఘాయిత్యం కలచివేసిందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిపై అదే పాఠశాల ప్రిన్సిపాల్ గారి కారు డ్రైవర్ వేధింపులకు గురి చేసిన ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు.. ప్రిన్సిపల్ ఎస్.మాధవిని, తన డ్రైవర్ రజనీకుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈ ఘటనపై చిరంజీవి మంగళవారం ట్విటర్ లో ‘‘ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించాలి. అన్ని విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రభుత్వం యుద్థ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా’’ అని స్పందించారు.